Khushbu Sundar : డీఎంకే అగ్ర నాయకుడు (DMK Top Leader) ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) నటి త్రిష (Actress Trisha) గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అలనాటి నటి, బీజేపీ నాయకురాలు (BJP leader) ఖుష్బూ సుందర్ (Khushbu Sunder) మరోసారి మండిపడ్డారు. ధైర్యముంటే మహిళలను తిట్టకుండా రాజకీయం చేయాలని సవాల్ విసిరారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంతోపాటు త్రిషతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియచేస్తున్నాయని ఖుష్బూ దుయ్యబట్టారు. ఒక నాయకుడిగా ఆయన దీనికి సిగ్గుపడాలని విమర్శించారు. ‘ఒక బహిరంగ వేదికపై మహిళను దూషించే జన్మహక్కు మీకు ఎవరిచ్చారు..? ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ విషయంలోనే కాదు.. ఇతర రాజకీయ పార్టీలలోనూ జరుగుతోంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్లు మహిళలను నిందిస్తారు..? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మహిళను అడ్డుపెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ ఆమెను అవమానిస్తున్నారంటే.. మీరు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోంది. మిమ్మల్ని మీరు బలమైన నాయకుడని చెప్పే అర్హత కోల్పోయారు. మీకు ధైర్యముంటే, నిజమైన నాయకుడిగా కొనసాగాలంటే ఏ మహిళనూ దూషించకుండా రాజకీయాల్లో నిలబడి చూపించండి’ అని ఖుష్బూ సవాల్ విసిరారు.
మహిళలను నిందించే సంస్కృతి డీఎంకే పార్టీ వారసత్వంలోనే ఉందని విమర్శించిన ఖుష్బూ.. మహిళలు రాజకీయాల్లో పావులు కాదని స్పష్టంచేశారు. ‘నేను ఇలాంటి మాటలు, లింగవివక్ష వ్యాఖ్యలను గతంలోనూ చూశాను. డీఎంకేలో మహిళలపై వేధింపులు జరగడం కూడా చూశాను. కానీ ఉదయనిధి స్టాలిన్ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదు. ఆయన యువ నాయకుడు, హూందాగా ప్రతిపక్షంలో ఉంటారని భావించాను. కానీ ఆయన కూడా ఇలాంటి అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయనలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేకపోవడం మరింత విచారకరం’ అన్నారు.
త్రిషతో తనకున్న అనుబంధాన్ని ఖుష్బూ ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘త్రిష చాలా మంచి వ్యక్తి. సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచి ఆమె నాకు తెలుసు. నా కుటుంబంలో ఆమె కూడా ఒక సభ్యురాలే. మా పిల్లలకూ ఆమె ఎంతో దగ్గరైంది. మా కుమార్తె పెళ్లికి నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది’ అని ఖుష్బూ వివరించారు.