న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పంపిణీ చేసే ప్రభుత్వ మందులను అక్రమంగా దారిమళ్లించి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. రూ.70 లక్షల విలువైన మందులను పోలీసులు సీజ్ చేశారు. ఈ స్కామ్కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. (Medicine Scam Busted) దేశ రాజధాని ఢిల్లీలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే కీలక మందులను ఒక ముఠా అక్రమంగా దారి మళ్లించి విక్రయిస్తున్నది. ఈ సమాచారం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు గురువారం ట్రాప్ వేశారు. తీస్ హజారీ ప్రాంతంలోని జై భారత్ ట్రాన్స్పోర్ట్ వద్ద రైడ్ చేశారు. రూ.70 లక్షల విలువైన ప్రభుత్వ సరఫరా మందులతోపాటు తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, భారీ మొత్తంలో మందులను తరలిస్తున్న ముగ్గురు నిందితులైన నీరేజ్ కుమార్, సుశీల్ కుమార్, లక్ష్మణ్ ముఖియాను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా ఏడాదిన్నర కాలంగా ఒక ముఠా ఈ స్కామ్కు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ మందుల తరలింపునకు సహకరిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, స్టోర్కీపర్గా పనిచేస్తున్న బినేష్ కుమార్, కాంట్రాక్ట్ సహాయకుడు ప్రకాష్ మెహతోను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్కు చెందిన హోల్సేల్ మందుల వ్యాపారి నీరేజ్ ప్రధాన నిందితుడని పోలీస్ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందుల సేకరణ, పంపిణీదారుడిగా అతడు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక లావాదేవీలు, ఈ నెట్వర్క్లోని ఇతర సభ్యులను గుర్తించేందుకు మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Helped Lover Kill Husband | ప్రియుడి సహాయంతో భర్తను చంపించిన భార్య.. ముగ్గురు అరెస్ట్
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?