Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. దేశ, విదేశాలకు వెళ్లే వందకుపైగా విమానాలకు ఇప్పటికే ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది.
ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్లైన్స్కు చెందిన దాదాపు 85 విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో 25 ఆకాశా ఎయిర్ ఫ్లైట్స్కాగా, 20 ఎయిర్ ఇండియా, 20 ఇండిగో, 20 విస్తారా ఫ్లైట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు.
కాగా, గత పది రోజుల్లోనే (తాజా బెదిరింపులతో సహా) 250కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో 600 కోట్ల మేర నష్టం..!
‘విమానంలో బాంబు పెట్టాం’ అని దుండగులు, ఆకతాయిలు పంపిస్తున్న హెచ్చరికలతో విమానాశ్రయాల్లో హైరానా నెలకొంటున్నది. ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే. దీంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సి వస్తున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు దాదాపుగా 600 కోట్లు నష్టపోయి ఉంటాయని గతంలో ఓ విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ఒక డొమెస్టిక్ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుందని, అంతర్జాతీయ విమానానికి ఇది దాదాపు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
కఠిన నిబంధనల తీసుకొచ్చే అవకాశం
విమానాలకు వస్తున్న బెదిరింపులన్నీ నకిలీవే. ఇంతకుముందు అడపాదడపా ఇలాంటి బెదిరింపులు వచ్చేవి. ఇవి చాలావరకు ఆకతాయిలు చేసే పనులే అయి ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒకేసారి పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తుండటంతో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరించాడు. దేశంలో విమానయాన రంగానికి ఆటంకం కలిగిస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చి ఎప్పడూ విమానాలు ఎక్కకుండా నిషేధించాలని విమానయాన శాఖ భావిస్తున్నది. దీంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిని వారెంట్ లేకుండా అరెస్టు చేసేలా సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగైనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్(స్వాస్కా చట్టం)-1982కు సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read..
Bengaluru | ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిన ప్రయాణికులు.. VIDEO
Trash balloons | సియోల్లోని అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
Justin Trudeau | కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం.. రాజీనామా చేయాలంటూ డెడ్లైన్