Manipur Violence | జాతి ఘర్షణల మధ్య ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు రాష్ట్రంలోని అన్ని సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల తర్వాత ఏజెన్సీలు డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై నిఘాను కఠినతరం చేసినట్లు చెప్పాయి. ఇప్పటి వరకూ 6,000లకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపాయి. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, నాశనం చేయడం వంటి వాటికి సంబంధించినవే. సోషల్ మీడియాలో వైరల్ గా మారే వదంతులతో ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడానికి గట్టి నిఘా పెట్టామని వెల్లడించాయి.
మరోవైపు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య స్థానిక పోలీసు (Police) స్టేషన్లలో వనరుల కొరత ఏర్పడింది. దీంతో హత్య, దాడి వంటి తీవ్రమైన నేరాల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను నిర్వహించడమే ప్రధానంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి కేంద్రం 135 విభాగాలను అక్కడికి పంపింది. అయితే, ఇప్పటికీ ఇంకా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ‘మణిపూర్లోని 16 జిల్లాల్లో సగం ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి బలగాలను రొటేషన్ విధానంలో వాడుతున్నాం’ అని సంబంధిత అధికారులు తెలిపారు.
మహిళల వివస్త్ర ఘటన తర్వాత మణిపూర్ హింసకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఓ వ్యక్తి తలను నరికి, వేలాడదీసిన వీడియో వైరల్గా మారింది. బాధితుడ్ని కుకీ తెగకు చెందిన డేవిడ్ థీక్గా గుర్తించారు. జూన్ 2న బిష్ణుపూర్ జిల్లాలోని ఓ ఏరియాలో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన ముగ్గురిలో డేవిడ్ ఒకరుగా తెలుస్తున్నది.
ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడి చేసి చంపేసిన ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు జూన్ 12న ఓ ఫిర్యాదు అందింది. ఇందులో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో పాటు మే 4 నుంచి 15 మధ్య జరిగిన పలువురు కుకీ మహిళలపై లైంగిక దాడులు, వారిని హత్య చేసిన ఘటనలపై ఫిర్యాదుదారులు వివరాలు అందించినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొన్నది.
1. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మే 4న లైంగిక దాడి జరిగింది. కాంగ్పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు మహిళలపై మైతీ వర్గానికి చెందిన అల్లరి మూక బహిరంగంగానే సామూహిక లైంగికదాడికి పాల్పడింది.(ఈ మహిళలనే నగ్నంగా ఊరేగించిన ఘటన వైరల్గా మారింది.)
2. మే 4న, ఓ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులైన 22 ఏండ్ల కుకీ యువతి, ఆమె స్నేహితుడిని 40 మంది మైతీ గ్రూపు.. వేధించడంతో పాటు దాడి చేసింది.
3. మే 5న, కాంగ్పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏండ్ల వయసు న్న ఇద్దరు యువతులపై లైంగికదాడి చేసి, హత్య చేశారు. మైతీ కమ్యూనిటీకి చెందిన కొంతమంది దుండుగులు, ఇంఫాల్లో కోనుంగ్ మమాంగ్ ఏరియాలో రెండున్నర గంటల పాటు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. తర్వాత గది తెరిచి చూస్తే, ఇద్దరు యువతులు రక్తపు మడుగులో ఉన్నారు.
4. మే 15న, ఇంఫాల్లోని ఓ ఏరియాలో మైతీ మూక ఓ 18 ఏండ్ల యువతిని అపహరించింది. ప్రతిఘటించే సరికి, ముక్కలుగా నరికేస్తామని దుండుగులు బెదిరించారు. అనంతరం బాధిత యువతికి నాగాలాంగ్లో కోహిమాలోని ఓ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా, లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది.
Also Read..
Urfi Javed | విమానంలో ఉర్ఫీకి వేధింపులు.. పబ్లిక్ ఫిగర్ నే కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదన్న నటి
Hyderabad | సాంబారులో బాగా ఉడికిన పాము.. భోజనం చేస్తుండగా కనిపించడంతో షాక్!
IRCTC | రైల్వే స్టేషన్లలో 20కే భోజనం.. 50కే కాంబో మీల్స్!