IRCTC | సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి ఇక నుంచి అధిక ధరలతో అందుబాటులో ఉన్న ఆహారానికి బదులుగా కేవలం రూ.20 ఎకానమి భోజనం, రూ.50లకే కాంబో భోజనం ప్యాక్ను కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
దీని వల్ల రైళ్లలో జనరల్ బోగీలలో ప్రయాణించే వారికి అతి చవక ధరలకే భోజనం అందుబాటులోకి తెచ్చారు. సరసమైన ధరలు, నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి తోడుగా ప్యాక్ చేసిన వాటర్ బాటిల్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీస్ (ఐఆర్సీటీసీ) సహకారంతో చవక ధరలకు రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చవక ధరలకు అందించే భోజన సదుపాయాలను తొలుత హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట నాలుగు రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టేషన్లలో ప్రయోగాత్మంగా ఆరు నెలలు అమలు చేస్తారు. ఆ తర్వాత లోటుపాట్లను సరి చేసుకోవడంతో పాటు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనలకు అనుగుణంగా దశల వారీగా అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి చవక ధరలకు లభించే భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీటిలో సౌత్ ఇండియా ఆహార పదార్ధాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.