హైదరాబాద్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబట్టి, మమత బెనర్జి స్వయంగా పోటీకి దిగిన నందిగ్రామ్లో మాత్రం ఆమెను ఓడించారు. మొత్తం 294 స్థానాలకుగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 214 స్థానాల్లో విజయం సాధించింది. కానీ నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతలో మమత పరాజయం మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో మమతాబెనర్జి ముఖ్యమంత్రి పదవి చేపడుతారా.. లేదా..? ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఏ చట్టసభలో సభ్యత్వం లేకపోయినా మమత సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం.. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా మంత్రిగాగానీ, ముఖ్యమంత్రిగానీ కొనసాగవచ్చు.
అయితే, ఈ అవకాశం కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఈ ఆరు నెలలో శాసనసభకుగానీ, శాసనమండలికిగానీ ఎన్నికవ్వాల్సిందే. లేదంటే పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. కాబట్టి మమతాబెనర్జి ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల లోగా ఏదైనా ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేయించి పోటీ చేసి గెలువవచ్చు.
గతంలోనూ ఇలాంటి పరిణామాలు..!
2011లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించినప్పుడు కూడా మమతాబెనర్జి లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు. అయినా ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత భవానీపూర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు.
అయితే, ఉప ఎన్నికల్లో పోటీచేసి కూడా ఓడిపోతే మాత్రం మమతాబెనర్జి సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కానీ, అలా జరిగే అవకాశం అత్యంత అరుదుగా మాత్రమే ఉంది. ఎందుకంటే అలాంటి ఘటన ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే చోటుచేసుకుంది. 2009లో అప్పటి జార్ఖండ్ సీఎం ఉప ఎన్నికల్లో తమర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!