No-Confidence Motion | కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై నేడు ప్రధాని మోదీ (Pm Modi) సమాధానం ఇవ్వనున్నారు. ఈ తీర్మానంపై దిగువ సభలో రెండు రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చర్చకు చివరి రోజైన నేడు మధ్యాహ్నం తర్వాత సభలో మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం స్పీకర్ అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
కాగా, సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 272 ఓట్లు అవసరం. ప్రస్తుతం లోక్సభ (Lok Sabha)లో అవిశ్వాసం ఎదుర్కొంటున్న బీజేపీకి సొంతంగా 303 మంది ఎంపీలున్నారు. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే కూటమికి మొత్తం 332 మంది సభ్యుల బలం ఉంది. ఇక విపక్ష ఇండియా (INDIA) కూటమిలో 144 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ (BRS) ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతిస్తే ఆ సంఖ్య 152కు చేరుతుంది. ఈ అవిశ్వాసంపై నెగ్గాలంటే మరికొంతమంది ఎంపీల మద్దతు అవసరం. తమకు అంత బలం లేకపోయినప్పటికీ.. మణిపూర్పై సైలెంట్గా ఉన్న ప్రధానిని మాట్లాడించేందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. దీంతో ఇవాళ మణిపూర్ (Manipur)పై ప్రధాని చేసే ప్రసంగం ఆసక్తికరంగా మారింది.
అవిశ్వాసంపై లోక్ సభలో వాడీవేడి చర్చ..
మరోవైపు అవిశ్వాసంపై రెండు రోజులుగా లోక్ సభలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడాలనే డిమాండ్తో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష కూటమి (INDIA) ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చర్చను మంగళవారం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్సభలో ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ తన రాజకీయాలతో మణిపూర్లో భరతమాతను హత్య చేసిందని విమర్శించారు. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
Also Read..
Cloudburst | హిమాచల్ప్రదేశ్లో కుండపోతగా వర్షం.. గిరి నది ఉప్పొంగి ఒకే కుటుంబంలో ఐదుగురు గల్లంతు
Madhya Pradesh | మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వ్లో మరో పులి మృతి..