న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం పార్లమెంట్లో దుమారం రేపింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన అనంతరం వెళ్తూ వెళ్తూ బీజేపీ మహిళా ఎంపీల బెంచ్ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. దీనిపై ఇరానీతోపాటు 20 మంది బీజేపీ మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని, చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. మణిపూర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నాటకాలు ఆడుతున్నదని విమర్శించింది. ఫ్లయింగ్ కిస్పై బీజేపీ పోస్టు చేసిన 14 సెకండ్ల నిడివి గల వీడియోలో రాహుల్ ముఖం స్పీకర్ వైపు ఉన్నదని, ఆ వైపునే ఆయన సైగలు ఉన్నాయని మహిళా కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా పేర్కొన్నారు. స్మృతి ఇరానీ, ఇతర మహిళా బీజేపీ ఎంపీలు రాహుల్పై ఎదురుగా కాకుండా, పక్క వైపుగా ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే బీజేపీ.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
ఏమో నేను చూడలేదు..!
సీసీటీవీ ఫులేజీ పరిశీలించి రాహుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీలు తమ ఫిర్యాదులో కోరారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని తాను చూడలేదని లేఖపై సంతకం చేసిన బీజేపీ ఎంపీ హేమమాలిని పేర్కొనడం గమనార్హం. పార్లమెంట్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘దాన్ని( ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని) నేను చూడలేదు. అయితే రాహుల్ తన ప్రసంగంలో మాట్లాడిన మాటలు తప్పు’ అని అన్నారు.