హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ‘30 శాతం కమీషన్ మంత్రి’గా పేరొందిన తెలంగాణ అమాత్యుడు ఏకంగా అమెరికాలో అధికారులకు చిక్కారు. నిబంధనలకు మించి సొమ్ము తీసుకెళ్తుండటంతో ఆయనను అమెరికాలోని ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. సుమారు గంటన్నర పాటు ఆయనను లోపలే కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఇంత డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి నుంచి సమకూర్చారు?’ వంటి ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇటీవల రాష్ర్టానికి చెందిన ఓ కీలక మంత్రి కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఈ సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది. అమెరికాలో దిగగానే తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడటంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్కు గురైనట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బు తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తంచేసిన అధికారులు.. ఆ మంత్రిని ఎయిర్పోర్టులోనే నిలిపేసినట్టు చర్చ నడుస్తున్నది.
ఎంత సేపటికీ ఆయన బయటకు రాకపోవడంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న వారంతా ఆందోళనకు గురైనట్టు తెలిసింది. తర్వాత వారు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి అక్కడివారితో అధికారులను ఒప్పించి మంత్రి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ విషయం ప్రభుత్వం, పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.