ప్రతి దవాఖానలో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి
పరీక్షలు పెంచి.. అందరికీ వ్యాక్సిన్ వేయాలి
అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు
హన్మకొండ, ఏప్రిల్ 24 : కరోనా చికిత్స అం దించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స, నివారణ తదితర అంశాలపై కలెక్టర్లతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కరోనా రెండో దశ వేగంగా వ్యా ప్తి చెందుతుందని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రజలకు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉం డాలన్నారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయి లక్షణాలు లేనివారు హోం ఐసొలేషన్లో ఉం టూ చికిత్స తీసుకుంటే సరిపోతుందని, ఆక్సిజన్ అవసరమైన, క్రిటికల్ కేసులకు దవాఖానల్లో చికిత్స అందించాలని సూచించారు. జిల్లాల్లో క రోనా పరిస్థితులపై కలెక్టర్లు వైద్యాధికారులతో ఉదయం, సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలన్నారు. చికిత్సకు అవసరమైన మం దులు, పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో అదనంగా కొవిడ్ పడకలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయన్నారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని సూచించారు. కొవిడ్ చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేట్ దవాఖానలను కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పరిశీలించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో సీనియర్ అధికారితో ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి దవాఖానలో 2 రోజులకు సరిపడా అవసరమైన ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆక్సిజన్ వేస్టేజ్ను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రూ.20కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా చికిత్సకు వినియోగించే మందులు, ఇతర పరికరాల కొరత స్పష్టించి అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
పకడ్బందీ చర్యలు తీసుకున్నాం..
జిల్లాలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. రెండు వారాలుగా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని స మీక్షిస్తున్నామన్నారు. కొవిడ్ చికిత్స కోసం 440 పడకలు సిద్ధం చేశామన్నారు. సోమవారం నుం చి 800 పడకలకు పెంచుతున్నట్లు తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్వో డాక్టర్ లలితాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వాసుచంద్ర, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.