బెంగళూరు: తమ పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలు ప్లాన్ వేశారు. (Couple Kills Children, Plan To Suicide) తొలుత ఇద్దరు పిల్లలను చంపారు. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోగా భార్య బతికిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హోస్కోట్ తాలూకాలోని గోనకనహళ్లి గ్రామంలో 32 ఏళ్ల శివు, భార్య మంజుల తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట అతడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
కాగా, కుటుంబ ఆర్థిక సమస్యలు పెరుగడంతోపాటు భార్యపై అనుమానం వల్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొంతకాలంగా సూసైడ్ చేసుకోవాలన్న భావనలో శిశు, మంజుల ఉన్నారు. అయితే పిల్లలు ఒంటరవుతారని వారు భావించారు. ఈ నేపథ్యంలో తొలుత పిల్లలను చంపి ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశారు.
మరోవైపు శనివారం మధ్యాహ్నం శివు, మంజుల కలిసి మద్యం సేవించారు. సాయంత్రం 4 గంటల సమయంలో తొలుత 11 ఏళ్ల కుమార్తె చంద్రకళ గొంతునొక్కి చంపారు. ఆమె మరణించిందా లేదా అన్న నిర్ధారణ కోసం కుమార్తె తలను నీటిలో ముంచారు. ఏడేళ్ల కుమారుడు ఉదయ్ సూర్యను కూడా అదే విధంగా చంపారు.
కాగా, ఆ తర్వాత ఉరి వేసుకోవడానికి మంజుల ప్రయత్నించింది. అయితే అనారోగ్యంతో వాంతి చేసుకున్న భర్త శివు సమీపంలోని షాపు నుంచి ఆహారం కొని తీసుకురావాలని చెప్పాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శివు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు పొరుగింటి వారి ఫోన్లో తండ్రితో మంజుల మాట్లాడింది. జరిగిన విషయం చెప్పింది.
మరోవైపు ఇది విన్న పొరుగింటి వారు షాక్ అయ్యారు. మంజుల ఇంటికి వెళ్లి చూడగా ఆమె పిల్లలు, భర్త శివు చనిపోయి కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు పిల్లలు, భర్త మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంజులను అదుపులోకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పైజామా లేకుండా టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత.. వీడియో వైరల్