నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి ఖాయమని మంత్రులు పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా హాలియా మున్సిపాలిటీలో హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ నడిచే ఓపిక లేక.. చేతకాక ప్రచారం చేయకుండా జానారెడ్డి పలాయనం చిత్తగిస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ అనీ అన్నారు. జానాకు వయస్సు మీదపడిందని, అయినా గెలిచి ఇక్కడ చేసేది ఏం లాభం లేదన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దివంగత నోముల నర్సింహయ్య పేదల మనిషని కొనియాడారు. ఆయన వారసుడు భగత్ను ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సబ్బండవర్గాలు భగత్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.