Chandrayaan-3 | ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3 ) మిషన్ని ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ ( Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు జరిపి అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపించాయి. ఈ క్రమంలోనే జాబిల్లిపై సూర్యాస్తమయం కావడంతో ఈనెల మొదట్లో ఆ రెండూ స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి. అయితే, ఇటీవలే అక్కడ సూర్యోదయం కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు.
అవి తిరిగి మేల్కొంటే మరో 14 రోజులపాటు చంద్రుడి రహస్యాలు భూమికి చేరుతాయని శాస్త్రవేత్తలు భావించారు. ఈ క్రమంలోనే నిద్రాణస్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్తో కమ్యూనికేట్ అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వాటి నుంచి ఎలాంటి సంకేతాలూ అందడం లేదు. దీంతో ఆ రెండూ జాబిల్లిపై చనిపోయాయా..? ఇక చంద్రయాన్-3 కథ ముగిసిపోయిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇస్రో మాత్రం తదుపరి సూర్యాస్తమయం వరకు ల్యాండర్, రోవర్లతో కాంటాక్ట్ అయ్యేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 30న చంద్రుడిపై సూర్యాస్తమయం కానుంది. దీంతో అక్కడ సూర్యాస్తమయానికి మరో ఐదు రోజులు సమయం ఉండటంతో.. శివశక్తి పాయింట్ వద్ద నిద్రావస్థలో ఉన్న ఆ రెండూ తిరిగి మేల్కొంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.
ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన సంగతి తెలిసిందే. 14 రోజులు పనిచేసేలా వీటిని రూపొందించారు. ఆ 14 రోజుల పాటూ అవి జాబిల్లి రహస్యాలను భూమికి చేర్చాయి. అనంతరం చంద్రుడిపై పగటి సమయం ముగియడంతో సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్, రోవర్ను నిద్రాణ స్థితిలోకి చేర్చారు. ఆ సమయంలో అక్కడ మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి చంద్రుడిపై తెల్లవారుజాము మొదలయింది. అక్కడ పూర్తి సూర్యోదయానికి రెండ్రోజులు పడుతుంది. అత్యంత శీతల పరిస్థితులకు గురైన ల్యాండర్, రోవర్.. ఈనెల 22వ తేదీన మేల్కోవాల్సి ఉంది. అయితే, వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అంద లేదు. ప్రస్తుతానికి మాత్రం వాటితో తిరిగి కాంటాక్ట్ ఎప్పుడు ఏర్పడుతుందనేది కూడా అనిశ్చితంగానే ఉంది.
ఇదిలావుండగా.. చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే విజయవంతమైంది. శివశక్తి పాయింట్ నుంచి రోవర్ 100 మీటర్లకు పైగా ప్రయాణం చేసి.. చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది. అక్కడి ఉష్ణోగ్రత వివరాలను కూడా భూమికి పంపింది. ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటే.. అవి అక్కడ పరిశోధనలు చేసి భూమికి పంపే సమాచారం ‘బోనస్’ అవుతుంది.
Also Read..
Suryakumar Yadav | 6, 6, 6, 6.. సూర్యకుమార్ సిక్సుల మోత.. వీడియో వైరల్
Rs 2,000 Notes | రూ.2వేల నోట్ల మార్పిడికి మరో 5 రోజులే గడువు..
Sudha Murty | తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి