న్యూఢిల్లీ : జంతర్ మంతర్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ దాడులపై పార్లమెంట్లో ప్రశ్నించాలని విపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పేదాకా పట్టుబట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నట్టు ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని పోలీసుల దాడిపై నిలదీయాలని, ఆ మేరకు పాటించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాహుల్ గాంధీ కోరారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ‘విద్యార్థులపై పోలీసులను దాడి చేయమని మీరు ఆదేశించారా.. లేదంటే ఎవరు ఆదేశించారో సమాధానం చెప్పాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. రాజ్యసభలో విద్యార్థుల మీద జరిగిన దాడిపై సోమవారం చర్చ జరపాలని.. ఆ మేరకు సాధారణ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ సభ సెక్రటరికీ లేఖ రాశారు.