న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే స్వేచ్ఛ, అసమ్మతి గళం క్రమంగా తగ్గిపోతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గంగా నదిలో పడవలో రంజాన్ ఉపవాస విరమణ సమయంలో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి, దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉంచిన ఉదంతాన్ని ఈ సందర్భంగా జస్టిస్ భుయాన్ ప్రస్తావించారు.
‘చికెన్ బిర్యానీ తినడం ఎక్కడా నేరం కాదు. గంగా నదిపై చికెన్ తినడాన్ని నిషేధిస్తూ ఎలాంటి చట్టం లేదు. కేవలం ఆ కారణంతోనే వారిని అరెస్ట్ చేసి, మూడు నెలలు జైలులో ఉంచడంసరైనదేనా? అని ప్రశ్నించారు. గాజాలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరసన తెలపడానికి సీపీఎం ప్రయత్నించగా, దాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ కూడా విమర్శలకు అతీతం కాదన్నారు.