Bangladesh Crisis | బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. పొరుగుదేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు అన్ని పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో నెలకొన్న తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పార్టీల నేతలకు వివరించారు.
బంగ్లాదేశ్లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని వెల్లడించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో హింస చెలరేగిన అనంతరం సుమారు 8 వేల మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లు చెప్పారు. వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. భారత్ చేరుకున్న అనంతరం హసీనాతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా జైశంకర్ తెలిపారు. హసీనా భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, రామ్మోహన్ నాయుడుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) వివరిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి తమను ఆహ్వానించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
Also Read..
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?
INDIA Alliance | ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ తగ్గించండి.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన
All Party Meeting | బంగ్లాదేశ్ సంక్షోభం.. ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం