సుజాతనగర్, ఆగస్టు 12 : తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామ కూడళ్లలో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యుడు సామినేని భాస్కరరావు ఆర్థిక సహకారంతో తన తల్లిదండ్రులు స్వర్గీయ సామినేని నారాయణ, మంగమ్మ జ్ఞాపకార్థం వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామంలోని సీనియర్ సిటిజన్లను గౌరవించాలని, బెంచీలను గ్రామ పంచాయతీ సిబ్బంది సంరక్షించి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా చూడాలని కోరారు. అనంతరం అంగన్వాడీ టీచర్ల విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫామ్స్ పంపిణీ చేశారు. గ్రామ పెద్ద బైరి సాంబయ్య సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిన్నెర వెంకన్న, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.