న్యూఢిల్లీ: ఇండియాలో సాధారణ పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకూ ఈ అత్యున్నత అవార్డును 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన తర్వాత ఇవ్వగా.. మిగిలిన 34 మందిలో ఇప్పటికీ జీవించి ఉన్నవాళ్లు నలుగురు మాత్రమే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, సింగర్ లతా మంగేష్కర్, సైంటిస్ట్ సీఎన్ఆర్ రావ్, ఆర్థికవేత్త అమర్త్యసేన్. మిగతా ఏ అవార్డుకూ లేని ఓ అవకాశం భారతరత్న అందుకున్న వారికి ఉంటుంది. వీళ్లు జీవితాంతం ఉచితంగా ఎయిరిండియా విమానాల్లో తిరగొచ్చు. 2003లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం భారతరత్న అవార్డీలను ఈ విధంగా గౌరవించాలని నిర్ణయించింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం ఒక్క భారతరత్న అవార్డీ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆ వ్యక్తి పేరు అమర్త్యసేన్. సమాచార హక్కు చట్టం కింద ఎయిరిండియా నుంచి ఇండియా టుడే ఈ విషయాన్ని రాబట్టింది. నోబెల్ బహుమతి విజేత కూడా అయిన సేన్ మాత్రమే 2015 నుంచి 2019 వరకూ 21 సార్లు ఇలా ఎయిరిండియా విమానాల్లో ఉచితంగా ప్రయాణించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆయన ప్రయాణించిన తేదీ, సమయం, టికెట్ ధర వివరాలను తాము స్టోర్ చేయలేదని, అందువల్ల ఈ ప్రయాణాల మొత్తం విలువ ఎంత అన్నది చెప్పలేమని కూడా ఎయిరిండియా తెలిపింది.