లక్నో : యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని బీజేపీ సర్కార్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి అనంతరం సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, నేతలను వేధింపులకు గురిచేస్తోందని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే భయం కాషాయ పార్టీని వెంటాడుతోందని అన్నారు. దిక్కుతోచని స్థితిలో పాలక పార్టీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తోందని అఖిలేష్ ఆరోపించారు.
కొవిడ్ నిబంధలను ఉల్లంఘించారనే సాకుతో ఎస్పీ శ్రేణులను వేధిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను హింసిస్తూనే మరోవైపు బీజేపీ నేతలు కొవిడ్-19 ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నా యూపీ సర్కార్ వారిని సమర్ధిస్తూ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, సత్తా చాటాలని బీఎస్పీ, కాంగ్రెస్ లు సన్నద్ధమవుతున్నాయి.