KCR | మహబూబాబాద్ : అడ్డగోలు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు.. కానీ నా మీద ఈసీ నిషేధం విధించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 48 గంటలు నా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తే.. దాదాపు 96 గంటల పాటు లక్షలాది బీఆర్ఎస్ కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేస్తారు అని కేసీఆర్ తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మహబూబాబాద్లో కేసీఆర్ ప్రసంగించారు.
పార్లమెంట్ ఎన్నికలు తరుణంలో మీ అందరు కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడిక రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎక్కువ టైం లేదు నాకు. ఈసీ నా మీద నిషేధం పెట్టింది. మహబూబాబాద్ అభివృద్ధి చెందాలని, మనందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన దీన్ని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెబుతుంది. మహబూబాబాద్ జిల్లా ఉండాల్నా..? పోవాల్నా..? మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే ఇక్కడ మాలోత్ కవిత గెలవాలి. మహబూబాబాద్ జిల్లాను కేసీఆర్ ఏర్పాటు చేసిండు.. మరి ఉండాల్నా..? ఊడిపోవాల్నా..? జిల్లా ఉండాలంటే కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి.. మాలోత్ కవిత గెలవాలి అని కేసీఆర్ సూచించారు.
ఈ ఏరియాలో తాగునీరు వచ్చేది కాదు. కాంగ్రెస్ 59 ఏండ్ల పాలనలో ఎస్సారెస్పీ స్టేజ్ 2 అని చెప్పి ఎన్నడూ నీళ్లు తీసుకురాలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాల్వ తవ్వాక నీళ్లు వచ్చాయి. ఈ ఏడాది నీళ్లు రాలేదు. ఏ కారణం చేత, ఎందువల్ల రాలేదో ఆలోచించాలి. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డగోలు హామీలిచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్నది. రైతుబంధు ఇవ్వలేదు. మహిళలకు రూ. 2500 వచ్చాయా..? తులం బంగారం వచ్చిందా…? ఏది కూడా రాలేదు. కానీ అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటే ఒక్క హామీ ఉచిత బస్సు నెరవేరిస్తే, భయంకరంగా ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడ్డారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బతుకులు ఆతగమైపోతున్నాయి. ఒక స్కీం పెడితే మంచిదే కానీ ఆ స్కీం పెట్టినప్పుడు వచ్చే బాధలు, ఇబ్బందులు గమనించి ఆటో రిక్షా కార్మికులకు న్యాయం చేయాలి. ఆ న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతది అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఇవాళ ఈసీ నా మీద నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ఆదేశించింది. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలు వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతా అని అడ్డగోలు మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ నా మీద నిషేధం పెట్టింది. ఈ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే.. దాదాపు 96 గంటలు లక్షలాది బీఆర్ఎస్ కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేస్తారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 15 రోజుల నుంచి వడ్లు కొనకపోతే తట్టుకోలేక వడ్లు ఆరబెడుతూ ఓ రైతు అక్కడనే గుండె ఆగిపోయి చనిపోయాడు. ఈ రోజు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఈ ఎన్నికల్లో వారే గెలిస్తే మళ్లీ మోసం చేస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మీ తరపున ఉన్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.