Air India plane crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకూ డీఎన్ఏ పరీక్షల (DNA samples) ద్వారా 184 మంది వివరాలు గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘ఉదయం 8 గంటల సమయం వరకూ 184 డీఎన్ఏలు సరిపోలాయి’ అని పేర్కొన్నారు. గుర్తించిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది.
గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రమాదానికి మూడు నెలల క్రితమే కొత్త ఇంజిన్..
విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 171 కుడివైపున ఉన్న ఇంజిన్ను మూడు నెలల క్రితమే ఓవర్ హాలింగ్ సమయంలో అమర్చినట్లు అధికారులు గుర్తించారు. . సుమారు 12 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న ఈ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి చివరిసారిగా జూన్ 2023లో నిర్వహణ పనులు చేపట్టారు. తదుపరి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2025లో నిర్వహించాల్సి ఉంది.
రూ.4 వేల కోట్లకుపైగా బీమా..!
ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బీమా వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రమాదం కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ బీమా కవరేజీని ఇంజిన్ మార్పిడికి ముందే రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) మొత్తం క్లెయిమ్లు సుమారు 475 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. భారత కరెన్సీ ప్రకారం రూ.4,000 కోట్లకుపైమాటే. ఈ మొత్తంలో విమానం నష్టానికి గానూ 125 మిలియన్ డాలర్లు కాగా, ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో 350 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read..
Iran | ఇరాన్తో యుద్ధంలో క్షీణిస్తున్న ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు.. మరో 10- 12 రోజుల్లో..!
FASTag | రూ.3 వేలతో ఏడాదంతా ప్రయాణం.. కొత్త ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చిన కేంద్రం
Melodi | మోదీతో మెలోనీ.. ట్రెండింగ్లో ‘మెలోడీ’ మూమెంట్