డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ప్రకటించింది. కల్నల్ (రిటైర్డ్) అజయ్ కోతియాల్ (Ajay Kothiyal) పేరును ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం డెహ్రాడూన్లో వెల్లడించారు. ఈ మేరకు ఆయన డెహ్రాడూన్ పార్టీ నేతలు, కార్యవర్గసభ్యులతో సమావేశమై ఎన్నికల వ్యూహరచన చేశారు. అనంతరం అజయ్ కోతియాల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
కల్నల్ (రిటైర్డ్) కోతియాల్ భారత సైన్యంలో సేవలందించారు. ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరించారు. గత ఏప్రిల్ 20 న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కోతియాల్.. 2013 కేదార్నాథ్ విపత్తు అనంతరం వార్తల్లో వ్యక్తిగా నిలిచి ప్రజలకు చిరపరిచితుడిగా మారారు. స్థానిక యువతకు సాయుధ దళాల్లో చేరేందుకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే ఒక సంస్థను ప్రస్తుతం అజయ్ కోతియాల్ నిర్వహిస్తున్నాడు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పారద్రోలేవిధంగా చర్యలు తీసుకుని యువతకు అవకాశాలు కల్పిస్తామని మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. హిందువులకు గ్లోబల్ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాగా, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రతి ఇంటికి నెలకు ఉచితంగా 300 యూనిట్ల వరకు విద్యుత్ అందిస్తామని, పాత విద్యుత్ బిల్లులను ఎత్తివేస్తామని గతంలో ఇక్కడ పర్యటించనప్పుడు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అలాగే, వ్యవసాయానికి కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, నెలకు మొదటి 100 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 100 యూనిట్లకు పైగా ఉపయోగించిన వారికి 50 శాతం సబ్సిడీని అధికార బీజేపీ ప్రకటించింది.
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్ను పాకిస్తాన్కిచ్చిన రాడ్క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక