Criminal Cases | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టాను బయటపెట్టింది. దాంతోపాటు ఆదాయపు వివరాలను కూడా ప్రకటించింది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Association for Democratic Reforms) నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 93 మంది క్రిమినల్ కేసులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఆ 93 మందిలోనూ 47 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైనట్లు నివేదించింది. ఇక ఓ ఎమ్మెల్యేపై ఏకంగా హత్య కేసు (ఐపిసి సెక్షన్ 302) నమోదైనట్లు తెలిపింది. ఆరుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం (ఐపీసీ 307), ఇద్దరు ఎమ్మెల్యేలపై నేరం (ఐపీసీ 354) కింద కేసులు నమోదైనట్లు వివరించింది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 186 మంది కోటీశ్వరులు అని పేర్కొంటూ మరో ఆసక్తికరమైన నివేదికను ఏడీఆర్ (ADR) ప్రకటించింది. రాష్ట్రంలో 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 83 శాతం అంటే 107 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. ఇక 97 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 76 మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ముగ్గురు కోటీశ్వరులు.
ఇందులో బీజేపీకి చెందిన సంజయ్ పాఠక్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. అతని మొత్తం ఆస్తి విలువ రూ.226 కోట్లకు పైమాటే. కట్ని జిల్లాలోని విజయరాఘవగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సంజయ్ పాఠక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ శుక్లా అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. అతడి మొత్తం ఆస్తి రూ. 139 కోట్లకు పైగానే ఉంది. ప్రస్తుతం ఆయన ఇండోర్ 1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read..
Fitness Influencer | అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి
Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి