Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఐదో నిందితుడి (5th accused)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు (police) తెలిపారు. కాగా, వైరల్ వీడియోలో కనిపిస్తోన్న వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మణిపూర్ లోయ, పర్వత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. పలు జిల్లాల్లో 126 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తాజాగా అదుపులోకి తీసుకున్న ఐదో నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ (19)గా గుర్తించినట్లు తెలిపారు.
మహిళల్ని ఊరేగించిన అమానవీయ ఘటన మణిపూర్లోని కంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన జరిగింది. అయితే బుధవారం ఆ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కిడ్నాప్, గ్యాంగ్రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32) అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఐదో నిందితుడిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులకు కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఈ 11 రోజులపాటు నిందితులను ఇంటరాగేట్ చేయనున్నారు.
మణిపూర్లో మెజారిటీ వర్గమైన మైతీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వటంతో మే 3న ఒక్కసారిగా జాతుల ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. హిందువులైన మెజారిటీ మైతీలకు, గిరిజనులైన మైనారిటీ కుకీ, నాగా మరికొన్ని జాతులకు మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ గిరిజనులకు చెందిన చర్చిలను కూల్చేయటం, గ్రామాలను తగులబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. మైతీ వర్గంలోని కొందరు భద్రతా బలగాల వద్ద ఆయుధాలను దొంగిలించి మారణహోమానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మే 4న దాదాపు వెయ్యిమంది మైతీలు కాంగ్పోక్పీ జిల్లాలోని బీ ఫైనోమ్ గ్రామంపై దాడిచేశారు. ఇండ్లన్నింటినీ తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీలను పట్టుకొని కొట్టి చంపేశారు.
ఈ మారణకాండకు భయపడి ఓ కుటుంబం అడవిలోకి పారిపోయింది. వారిని పోలీసులు రక్షించి స్టేషన్కు తీసుకెళ్తుండగా ఆ అల్లరిమూక అడ్డగించింది. ముగ్గరు మహిళలను, ఇద్దరు పురుషులను బలవంతంగా పోలీసుల నుంచి లాక్కెళ్లింది. మహిళల్లో 20 ఏండ్ల యువతితోపాటు 40, 50 ఏండ్లున్న మరో ఇద్దరు ఉన్నారు. వీరిని నగ్నంగా మార్చి ఊరేగించారు. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి తండ్రితోపాటు సోదరున్ని చంపేశారు. పోలీసుల కండ్లెదుటే జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మే 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దారుణానికి పాల్పడినవాళ్లంతా మైతీ లీపున్, కాంగ్లీపాక్ కంబలూప్, అరంబై తెంగోల్, వరల్డ్ మైతీ కౌన్సిల్, షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ తదితర మైతీ సంఘాలకు చెందినవారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాదాపు 70 రోజులైనా బాధ్యులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాజాగా వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Manipur Violence | మణిపూర్ హింస.. మరో వీడియో వైరల్.. 6 వేల కేసులు నమోదు..!
Urfi Javed | విమానంలో ఉర్ఫీకి వేధింపులు.. పబ్లిక్ ఫిగర్ నే కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదన్న నటి
Janhvi Kapoor | ఆ విషయంలో ఎవరూ నాతో పోటీ పడలేరు.. తన టాలెంట్ బయటపెట్టిన జాన్వీ కపూర్