కొల్చారం, ఆగస్టు 12: యూరియా కోసం ఓ రైతు సహకార సంఘం నిర్వాహకుల కాళ్లపై పడి వేడుకున్న ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో చోటుచేసుకున్నది. చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు బోయిని రాములు ఎకరం పొలంలో వరినాటు వేశాడు. చిలిపిచెడ్ మండలంలో యూరియా దొరుకలేదు. అతడు చదువుకోలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్పై ఏ మాత్రం అవగాహన లేదు. ఎలాగైనా యూరియా సంపాదించాలని బుధవారం చిట్కుల్ సమీపంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి చేరుకున్నాడు. రూ.900 ఒక యూరియా బస్తా చొప్పున రెండు ఇప్పించాలని అక్కడే కుర్చీలో కూర్చున్న సహకార సంఘం అటెండర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. రైతు ఆవేదన చూసిన తోటి రైతులు సైతం చలించిపోయారు. బాధిత రైతుకు యూరియా బస్తాలు ఇప్పించాలని తోటి రైతులు సహకార సంఘం నిర్వాహకులను కోరారు. ఒకవేళ యూరియా బస్తాలు మిగిలితే చూద్దామని నిర్వాహకులు చెప్పినట్టు తెలిసింది.