Student Suicide | న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide). గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం తెలిపారు.
మహారాష్ట్ర నాసిక్కు చెందిన సంజయ్ నెర్కర్ (24) ఢిల్లీ ఐఐటీలో ఎమ్టెక్ (MTech) చేస్తున్నాడు. అతడు ద్రోణాచార్య హాస్టల్లోని రూమ్ నంబర్ 757లో ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెర్కర్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళన చెంది హాస్టల్ సిబ్బందిని సంప్రదించారు. సిబ్బంది వెంటనే నెర్కర్ రూమ్ వద్దకు వెళ్లి చూడగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. నెర్కర్ ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది కనిపించాడు.
దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Also Read..
Farmer Unions: రైతు సంఘాలతో భేటీ పాజిటివ్గా ముగిసింది: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
ATM fraud | ఏటీఎంలలో కొత్త తరహా చోరీ.. ప్లాస్టర్ వేసి నగదు కాజేత
CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అతడే : పాడి కౌశిక్ రెడ్డి