ATM fraud: దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోగల దస్నాపూర్ ఏటీఎంలో ముగ్గురు దుండగులు నయా తరహా మోసానికి పాల్పడ్డారు.
ఏటీఎంలో నగదు బయటకు వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్ను ఎవరికీ అనుమానం రాకుండా అంటించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన సతీష్ దేశ్పాండె ఆ ఏటీఎంకు వెళ్లి రూ.5 వేలు డ్రా చేశారు. ఎంతకీ నగదు బయటకు రాలేదు. ఆయన ఖాతా నుంచి మాత్రం రూ.5 వేలు డెబిట్ అయినట్లు చరవాణికి సమాచారం వచ్చింది. దీంతో ఆయన బ్యాంకు యాజమాన్యానికి, మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ ఏటీఎంలోని నిఘా కెమెరా సీసీ ఫుటేజీని పరిశీలించగా దుండగులు ప్లాస్టర్ అంటించినట్లు గుర్తించారు. నగదు బయటకు రాకపోవటంతో అక్కడి నుంచి సతీష్ దేశ్పాండె బయటకు వెళ్లిపోయాక దుండగులు వారు అంటించిన ప్లాస్టర్ను తొలగించి నగదును తీసుకెళ్లారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్ఐ వంగ విష్ణువర్ధన్ తెలిపారు.