మేడ్చల్ : ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. కరోనా నేపథ్యంలో సైతం ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు 2020-21 విద్యాసంవత్సరానికి మేడ్చల్ జిల్లాకు 79 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదివే 21,131 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే వారికి ట్యూషన్ ఫీజులతోపాటు మెయింటెనెన్స్ను స్కాలర్షిప్ల రూపంలో అందిస్తుంది. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొందిన 7467 మంది విద్యార్థులతోపాటు గత విద్యాసంవత్సరం వరకు ఉన్న 13,664 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు ప్రభుత్వం 79 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించనున్నారు.
కులాంతర వివాహాలకు రూ. 1.17 కోట్లు
కులాంతర వివాహాల ప్రోత్సాహక పథకానికి 1.17 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్సీ కులానికి చెందిన యువతీ, యువకులను ఎస్సీలకు చెందిన వారు కాకుండా ఇతరాత్ర కులాలకు చెందిన వారు వివాహం చేసుకుంటే కులాంతర వివాహ ప్రోత్సాహక పథకం వర్తిస్తుంది. జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న 40 జంటలు దరఖాస్తు చేసుకోగా జంటకు 2.50లక్షల చొప్పున అందించనున్నారు. వివాహం చేసుకున్న జంటల పేరిట 2.25లక్షల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 25 వేల నగదును క్యాష్ రూపంలో ఇవ్వనున్నారు. ప్రోత్సాహక పథకం నగదును మరో 10 రోజుల్లో జంటలకు అందిస్తారు.
త్వరలోనే అందిస్తాం..
ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్నకు సంబంధించిన 79 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 21,131 మంది విద్యార్థులకు స్కాలర్షిష్ అందిస్తాం. అర్హులైన ఎస్సీ విద్యార్థులందరూ దరఖాస్తులు చేసుకోవాలి. కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి 1.17 కోట్లు మంజూరయ్యాయి. 40 మంది జంటలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తాం. వినోద్కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి