బొంరాస్పేట, ఏప్రిల్ 26 : ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి దుద్యాల, బొంరాస్పేట మండల కేంద్రా ల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
రేవంత్రెడ్డి సీఎంగా గెలిచిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థే లేడని ఎద్దేవా చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, పార్టీ నాయకులు బంటు రమేశ్, పున్నంచంద్ లాహోటీ, బాబయ్యనాయుడు, శ్రీనివాస్, నర్సింహులు పాల్గొన్నారు.