మోర్తాడ్/నిజాంసాగర్, ఆగస్టు 4: ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఎగువప్రాంతం నుంచి కేవలం 5వేల క్యూసెక్కుల వరదరాగా మంగళవారం ఉదయం 6గంటలకు 33, 497 క్యూసెక్కులు వచ్చింది. సాయంత్రం 6గంటలకు 22, 222 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1075.80 అడుగుల (34. 577టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 934 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
403క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 7,780 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో ఉన్న పోచారం ప్రాజెక్టు అలుగు ద్వారా వరద రావడంతో నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్ర స్తుతం 1397.85 అడుగుల (9.18 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.

మత్తడి దూకిన చెరువులు.. మునిగిన పొలాలు
నిన్న మొన్నటి దాకా బోసిపోయిన చెరువులు జల కళ సంతరించుకున్నాయి. చాలా తటాకాలు పూర్తిగా నిండడంతో మత్తడి దూకుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువులోకి భారీ వరద రావడంతో అలుగు పోస్తున్నది. బాన్సువాడ మండలంలోని బోర్లం, సంగోజీపేట్, హన్మాజీపేట్, తాడ్కోల్, తిర్మలాపూర్,ఇబ్రహీంపేట్, పోచా రం, దేశాయిపేట్ చెరువులు అలుగు పారుతున్నాయి. వరద ఉధృతి కారణంగా పలుచోట్ల పొలాలు నీట మునిగాయి. బాన్సువాడ మండలంలోని మొగులాన్పల్లి, కొయ్యగుట్ట, బోర్లం, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్ గ్రామ శివారులోని పొలాలు వరద నీటితో పూర్తిగా మునిగి పోయాయి. బీర్కూర్తో పాటు నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని పంటలు నీట మునిగాయి.
ఉప్పొంగిన వాగులు
భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. లింగంపేట పెద్దవాగు ఉప్పొంగింది. లింగంపేట, గాంధా రి మండలాల్లో కురిసన భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం పెరిగింది. పెద్ద వాగు ఉధృతి కారణంగా పోచారం ప్రాజెక్టు రాత్రికి రాత్రే నిండి పోయింది. మరోవైపు, పల్వంచ వాగు నిండుగా ప్రవహించింది. బాన్సువాడ మండలంలోని అవాజ్పల్లి మత్తడి, కొల్లూరు వాగు, చెదల వాగులు పొంగిపొర్లాయి.
నిలిచిన రాకపోకలు..
కామారెడ్డి- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలోని లింగంపల్లి సమీపంలోని పాముల వాగు వంతెన కొట్టుకుపోయింది. గతేడాది భారీ వర్షాలకు బ్రిడ్జి కూలే దశకు చేరుకోగా, అధికారులు దానిపై నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. దానికి సమాంతరంగా తాత్కాలికంగా నిర్మించిన మట్టి కట్ట తాజాగా కోతకు గురైంది. దీంతో కామారెడ్డి-ఎల్లారెడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసి కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్ ఇక్కడకు చేరుకుని పరిశీలించారు.
అధికారులు మట్టితో మళ్లీ రోడ్డును పటిష్టం చేసి సాయంత్రానికల్లా రాకపోకలను తిరిగి ప్రారంభించారు. అచ్చంపేట పంచాయతీ పరిధిలోని నాగమడుగు లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మహ్మద్నగర్ మండలంలోని తుర్కపల్లి చెరువు నుంచి వస్తున్న నీరు రోడ్డపై ప్రవహించడంతో తున్కిపల్లి వైపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మహ్మద్నగర్ మండలంలోని సింగీతం-తెల్గపూర్ ప్రధాన రహదారిపై శనివార్పేట్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి.