నిషేధిత జాబితా భూముల విషయమై ఎవరూ నోరుమెదపవద్దని కలెక్టర్ అంతర్గత ఆదేశాలివ్వడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఈ విషయమై బాధితులు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు అడిగినా తమకేం తెలియదని మౌనం పాటిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని వందలాది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేర్చి చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ ఆగడాలకు అధికారులు వంతపాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటిదాకా తమ ఇల్లు, తమ ఆస్తి అనుకున్నవాటిని అవి మీకు చెందినవి కావు.. ప్రభుత్వ ఆస్తులని చెప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకువస్తున్న అడ్డగోలు ప్రకటనలపై బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సిటీ బ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): అధికారుల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతున్నది. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంలో తప్పు మీదంటే.. మీదని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూముల వివరాలు, సర్వే నంబర్లు నమోదు చేయడంలో జరిగిన పొరపాట్ల వల్లనే ఆయా ప్రాంతాల్లోని నిర్మాణాలు, భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సబ్ రిజిస్ట్రేషన్ల అధికారులు చెప్తున్నారు. సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ల నుంచి డాక్యుమెంట్ల నిర్వహణ, భూములు, నిర్మాణాల వివరాలను నమోదు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లనే ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.
కార్యాలయాలకు క్యూ ..
గ్రేటర్ పరిధిలోని 16 మండలాల్లోని వందలాది నిర్మాణాలు, స్థలాలు నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తమ ఇండ్లు, స్థలాలు నిషేధిత జాబితాలోకి ఎందుకు చేర్చారని బాధితులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వరుస కడుతున్నారు. దీంతో ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఎందుకున్నాయో తమకు సంబంధం లేదని అదంతా రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంటుందని తేల్చి చెప్తున్నారు.
ఈ క్రమంలో బాధితులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే కేవలం ఫిర్యాదులు తీసుకుని పరిశీలిస్తామని చెప్తూ పంపించేస్తున్నారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తమకు తెలియదని ఆ అంశం కలెక్టర్ పరిధిలో ఉంటుందని.. తమకేమీ తెలియదని జవాబిస్తున్నారు. దీంతో బాధితులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులెవరికీ తెలియనప్పడు తమ ఆస్తులు నిషేధిత జాబితాలోకి ఎలా చేరుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని ప్రభుత్వ భూములుగా ఎలా మారుస్తారని నిలదీస్తున్నారు.
మౌనం వీడని రెవెన్యూ అధికారులు
దశాబ్దాల కిందటే కొనుగోలు చేసి అన్ని ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్న ఇండ్లు… పట్టా భూములను అన్ని సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను ఉన్నపలంగా నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలకు క్యూకడుతున్నారు. తమ ఆస్తులను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు. కానీ వాళ్లకు ఏ అధికారి కూడా సరైన సమధానం ఇవ్వకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.
నిషేధిత జాబితాపై ఎవరూ స్పందించవద్దని.. బాధితులకు ఎటువంటి హామీలు ఇవ్వవద్దని జిల్లాలోని అన్ని స్థాయిల రెవెన్యూ అధికారులకు కలెక్టర్ అంతర్గతంగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. భారీ మొత్తంలో నిర్మాణాలు, భూములు నిషేధిత జాబితాలో చేరడంతో ఎలాంటి కామెంట్స్ చేయొద్దని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఏదో జరుగుతున్నదనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్నట్టుండి నిషేధిత జాబితాలో చేర్చి.. ఎందుకిలా జరిగిందని అడిగితే సమాధానం చెప్పకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.