ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 26 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకోవటం కోసం నియోజకవర్గంలోని బొంగ్లూరు ఔటర్రింగ్రోడ్డు, బొంగ్లూరుగేటు, మంగల్పల్లి ఎక్స్రోడ్డు, కొత్తగూడ ఎక్స్రోడ్డు, అబ్దుల్లాపూర్మెట్, మాల్ తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ చెక్పోస్టుల ద్వారా ఇప్పటివరకు రూ.12,08,550 సీజ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, లిక్కర్, డ్రగ్స్ వంటివాటిని కూడా సీజ్చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3,39,341ఓట్లున్నాయని, ఇందులో 1,70,807పురుష ఓటర్లు, 1,68,499స్త్రీల ఓటర్లున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 343పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలు కూడా ఇబ్రహీంపట్నానికి చేరుకున్నాయని, వీటిని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపర్చినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీని పూర్తిస్థాయిలో అరికడుతామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.