న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు (Custodial Deaths) నమోదయ్యాయి. 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు నమోదైన లాకప్ డెత్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు మంగళవారం వెల్లడించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు రాష్ట్రాల వారీగా అందిన గణాంకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధికంగా 19 కస్టడీ మరణాల కేసులతో బీహార్లో టాప్లో నిలిచింది. 18 లాకప్ డెత్ కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో, 15 కేసులతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలో 14 చొప్పున కస్టడీ మరణం కేసులు నమోదయ్యాయి.
కాగా, ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే ఒడిశాలో 9, పశ్చిమ బెంగాల్లో 7 లాకప్ డెత్ కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాంలో 5, అరుణాచల్ ప్రదేశ్లో 3 కేసులు రికార్డ్ అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దేశ రాజధాని ఢిల్లీలో 4, అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరిలో ఒక్కో కేసు నమోదైంది. అయితే జమ్ముకశ్మీర్లో ఇప్పటి వరకు ఎలాంటి కస్టడీ మరణం కేసు నమోదు కాలేదు.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో 7 లాకప్ డెత్ కేసులతో తమిళనాడు టాప్లో ఉన్నది. తెలంగాణలో 5, కర్ణాటక, కేరళలో 3 కేసుల చొప్పున నమోదయ్యాయి.
కాగా, గత ఐదేళ్లలో కస్టడీ మరణాలు తగ్గుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 2021-22లో 176, 2022-23లో 163, 2023-24లో 157, 2024-25లో 140 లాకప్ డెత్ కేసులు నమోదయ్యాయి. అయితే 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు కేవలం 74 రోజుల్లో దేశ వ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
Also Read:
Arrow Pierces Monkey’s Neck | కోతి మెడలోకి దూసుకెళ్లిన బాణం.. నాలుగు రోజుల్లో రెండో దాడి
Watch: భారీ గడ్డి లోడ్తో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి ఊగిపోతూ బోల్తా