Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తొయిబా(Lashkar-e-Taiba) టాప్ కమాండర్గా వ్యవహరిస్తున్న అబిద్ రంజాన్ షేక్ స్వగృహంపై అతని తల్లిదండ్రులు త్రివర్ణ పతాకాన్ని(National flag) సగర్వంగా ఎగురవేశారు. తమ కుమారుడు ఉగ్రవాద బాట పట్టినప్పటికీ, తాము మాత్రం భారతమాత సేవలోనే ఉంటామని, దేశభక్తికి కట్టుబడి ఉన్నామని చాటిచెప్పారు. కాగా, అబిద్ రంజాన్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
కాశ్మీర్ లోయలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలలో ఇతడి ప్రమేయం ఉన్నందున భద్రతా దళాల అబిద్ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చాయి. అలాగే కాశ్మీర్లో స్థానికేతరులపై దాడులకు ఆదేశించినట్లు కూడా అతనికి పేరుంది. ఉగ్రవాది ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారతీయ కల్చర్లో గల భిన్నంత్వంలోని ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శాంతియుతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాను ఎగురవేశారు.