రాయ్పూర్: వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. (15 Deer Killed By Dogs) ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అంబికాపూర్లోని సంజయ్ వన్ వాటికను అటవీ శాఖ నిర్వహిస్తున్నది. చిన్న జూ మాదిరిగా ఉండే ఈ వనంలో పలు రకాల జింకలు ఉన్నాయి. వీటిని చూసేందుకు సందర్శకులు వస్తుంటారు.
కాగా, శనివారం తెల్లవారుజామున జింకల ఎన్క్లోజర్లోకి ఐదారు వీధి కుక్కలు చొరబడ్డాయి. అక్కడి జింకలపై దాడి చేశాయి. దీంతో మచ్చల జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల దుప్పిలతో సహా పద్నాలుగు జింకలు శనివారం మరణించాయి. కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడిన ఒక జింక ఆదివారం చనిపోయింది.
మరోవైపు కుక్కల దాడి వల్ల 15 జింకలు చనిపోయినట్లు సుర్గుజా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) అభిషేక్ జోగావత్ తెలిపారు. నిబంధనల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక డిప్యూటీ రేంజర్, ముగ్గురు ఫారెస్ట్ గార్డులతో సహా నలుగురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
అంబికాపూర్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అభిషేక్ జోగావత్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Also Read:
Man Kills Wife Over Dowry | నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం.. కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
Watch: ఖరీదైన కారుతో రోడ్డుపై స్టంట్లు.. వీడియో వైరల్