చండీగఢ్: నర్సింగ్ హోమ్లో పని చేస్తున్న ఒక జంట ప్రేమ వివాహం చేసుకున్నది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే కట్నం కోసం భార్యను భర్త వేధించాడు. ఈ వివాదం నేపథ్యంలో విషపు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హత్య చేశాడు. (Man Kills Wife Over Dowry) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా బెహ్తా హజీపూర్కు చెందిన అరుణ్ శర్మ, గురుగ్రామ్లోని నర్సింగ్ హోమ్లో రేడియాలజిస్ట్గా పని చేస్తున్నాడు. అక్కడే నర్సుగా పని చేస్తున్న కాజల్, అతడి మధ్య స్నేహం పెరిగింది. ఇది ప్రేమకు దారి తీసింది. దీంతో గత ఏడాది నవంబర్లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
కాగా, పెళ్లైన కొన్ని రోజులకే కట్నం కోసం కాజల్ను అరుణ్ వేధించసాగాడు. మార్చి 17న మద్యం మత్తులో భార్యను కొట్టాడు. ఆ మరునాడు వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కాజల్కు ముక్కు నుంచి రక్తం కారగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు టాయిలెట్లో ఒక సిరంజి దొరికిందని, అరుణ్ ఆమెకు విషం ఇంజెక్షన్ చేసి హత్య చేశాడని కాజల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన అరుణ్ను రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.
అయితే కాజల్కు విషపు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే ఆమె మరణించినట్లు అరుణ్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు గతంలో డ్రగ్స్కు బానిసైనట్లు తెలిసిందన్నారు. కాజల్ మృతదేహానికి పోస్ట్మార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తున్నాయని అన్నారు.
Also Read:
Ghaziabad Spy Case | ఘజియాబాద్ గూఢచర్యం కేసులో.. పోలీసుల అదుపులో 9 మంది మైనర్లు
fake Aadhaar card scheme | బాలికలను హోటల్కు తీసుకెళ్లేందుకు యత్నం.. ముగ్గురు అరెస్ట్
Karnataka Officer Dies by Suicide | సీనియర్ వేధింపులు తాళలేక.. అధికారి ఆత్మహత్య