నల్గొండ : ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat reddy ) వెల్లడించారు. రైతులు ఆరుతడి పంటే వేసుకోవాలని సూచించారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు.
నాగార్జునసాగర్ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉందని, శ్రీశైలం నుండి నీరు వచ్చినప్పటికి పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుందని వెల్లడించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు .
జిల్లాలో పంట మార్పిడి లో భాగంగా 33 వేల ఎకరాలలో వరికి వదులు ఆరుతడి పంటలు వేశారని . దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో ఆరు తడి పంటలు వేయించాలన్నారు. కరువు వచ్చినప్పటికి నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ , నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ,హాలియా , నిడమనూరు పీఏసీఎస్ అధ్యక్షులు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.