కరోనా విపత్కర సమయంలోనూ ధాన్యం కొనుగోలు
ఆదర్శంగా నిలుస్తున్న ఐకేపీ, మెప్మా..
వనపర్తి జిల్లాలో 77 చోట్ల కేంద్రాల ఏర్పాటు
వనపర్తి, మే 20 : కరోనా సెకండ్వేవ్ ప్రతాపా న్ని చూపుతున్నది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునే అన్నదాతలు కష్టాలు పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అన్నదాతలు పడే శ్రమ ముందు మేము చేసే సేవ చాలా చిన్నదని ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మహిళలు కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మహిళా సం ఘాల సభ్యులు మనోనిబ్బరంతో ధాన్యం కొనుగోలును విజయవంతం చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 77 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెంటర్కు ధాన్యం వచ్చినప్పటి నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించే వరకు కంటి మీద కునుకు లేకుండా పని చే స్తున్నారు. ధాన్యంలో తేమ, తాలు ఇలా నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం చేసిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు లో పొందుపరుస్తూ ట్యాబ్లో అప్లోడ్ చేస్తున్నారు.
కరోనాకు జంకకుండా విధులు..
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఐదుగురు మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ముందుగా జిల్లా కేంద్రంలో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఎంపిక చేసిన మహిళల్లో మొదటి మహిళ ధాన్యంలో తేమ చూడడం, రెండో మహిళ తూకం వేయించడం, మూడో మహిళ సంచులు ఇవ్వడం, నాలుగో మహిళ లారీల్లో ఎక్కించడం, ఐదో మహిళ రికార్డులు రాసే బాధ్యతలు తీసుకుంటున్నారు. రైతులకు అన్ని రకాలుగా సహాయపడుతూ రైస్ మిల్లర్లు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పర్యవేక్షిస్తున్నారు. రైతుల సీరియల్, తూకం విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండేలా నిత్యం హమాలీలతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఐకేపీ, మెప్మా ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేదు.