యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామి వారి పవిత్రో త్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో అంకురార్ప ణతో పవిత్రోత్సవాలను పంచరాత్రగమ శాస్త్రరీతిలో ప్రారంభించారు. విశ్వక్సేనుడికి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రత్యేక పీఠంపై మూడు ప్రధాన కలశాలను ఏర్పాటు చేసి గంగాజలంతో గర్భాలయంతో పాటు ఆలయ పరిసరాలు, భక్తుల క్యూలైన్లను సంప్రోక్షణ గావించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అంకురార్పణ చేశారు. 12 పాలికల్లో పుట్టమట్టిని తెచ్చి వాటిలో నవధాన్యాలు, పంచామృతాలను పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశంచేసి అగ్నిప్రతిష్ఠ గావించారు. దేవతామూల మంత్రాలతో హవనం నిర్వహించారు.