మెహిదీపట్నం, ఆగస్టు 3: ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు చెల్లించి, యధాతథంగా స్కీమ్ను కొనసాగించాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్పై సీఎం రేవంత్రెడ్డి ఇంత రాద్ధాంతం దేనికి చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారని వాపోయారు.
కోర్సు పూర్తి అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోర్టులు తీర్పులు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్రనే కాకుండా.. 23 వేల ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఉన్నతవిద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్, నాయకులు నీల వెంకటేష్, రాజేందర్ ముదిరాజ్, పగిళ్ల సతీశ్, ఆశిష్ గౌడ్, లింగయ్య యాదవ్, భీమ్ రాజ్, నిఖిల్ పటేల్, బారీ అశోక్, సిద్ధు యాదవ్, నరేశ్ గౌడ్, వంశీ పటేల్, కిరణ్, చిల్లర యశ్వంత్, గోపి, బలరాం తదితరులు పాల్గొన్నారు.