Kodada | కోదాడ : అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కోదాడ పెన్షనర్స్ బిల్డింగ్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ నిజాయితీగల అధికారిపై అసభ్య పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కమిషనర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీవో అధ్యక్షులు చిరంజీవి, కోదాడ యూనిట్ ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు వరకాల జానయ్య, కార్యవర్గ సభ్యులు బాలేమియా, కోటి కోటయ్య, తదితర పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.