Padamati Anvitha Reddy | ఆక్సిజన్ అంతగా అందదు. అందులోనూ ఎముకలు కొరికే చలి. కాలు కదలదు. పట్టు దొరకదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పర్వతాలను అధిరోహిస్తూ తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేస్తున్నది పడమటి అన్వితారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యర్రంబల్లి గ్రామానికి చెందిన ఈ పర్వతారోహకురాలి సాహసయాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. 18 నెలల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెట్టిన అన్విత ఇప్పటికే విజయవంతంగా మూడు పర్వతాల శిఖరాగ్రాలను ముద్దాడింది.
అన్వితారెడ్డి తల్లిదండ్రులు చంద్రకళ, మధుసూదన్ రెడ్డి. తండ్రి రైతు. తల్లి అంగన్వాడిలో పనిచేస్తున్నది. ఎంబీఏ చదివిన అన్విత 17 ఏండ్ల వయసు నుంచి కొండలు ఎక్కడం నేర్చుకుంది. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. పర్వతారోహణపై పట్టు సాధించింది. చిన్నచిన్న కొండలను అధిగమిస్తూ సాగిన ఆమె ప్రయాణం భూమ్మీద అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ అంచు వరకూ చేరుకుంది. ఈ ఏడాది మే 16న ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పర్వాతారోహకుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తెలంగాణకు చెందిన రెండో మహిళగా గుర్తింపు పొందింది. దీనికన్నా ముందు సిక్కింలోని రీనాక్, బీసీ రాయ్ తదితర గిరులను కూడా అధిరోహించి ‘ఔరా!’ అనిపించుకుంది అన్విత.
ప్రస్తుతం భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న అన్విత ఈ రంగంలో తన పేరు సుస్థిరంగా నిలిచిపోవాలని భావించింది. ఇందుకోసం ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తయిన పర్వతాలను 18 నెలల వ్యవధిలో అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే యూరప్లోని ఎల్బ్రస్, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తన సత్తా చాటింది. త్వరలోనే అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ పర్వతారోహణకు బయల్దేరనుంది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణ అమెరికాలోని అకాంకాగువా, ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని కార్టెన్జ్ పిరమిడ్ అధిరోహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత ఉత్తర అమెరికాలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించనుంది. ఈ పర్వతాలన్నిటినీ దట్టంగా మంచుకురిసే శీతకాలంలోనే అధిరోహించాలని నిర్ణయించుకోవడం మరో ప్రత్యేకత. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తన సత్తా చాటాలని నిశ్చయించుకున్న అన్వితకు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం!
…✍ పున్న శ్రీకాంత్