– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి
రాజాపేట, ఆగస్టు 21 : వర్షాభావంతో ఎండిపోతున్న పంటలను ఆదుకునేందుకు ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను కాలేశ్వరం జలాలతో నింపి రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాజాపేట మండలం బొందుగులలో ఎండిపోయిన పంట పొలాలు, చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతున్నాయన్న సమాచారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించగా, నాట్లు వేసిన 25 రోజులకే పంటలు ఎండిపోతున్న దుస్థితి కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 50 నుంచి 60 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, మరో 100 ఎకరాల వరకు పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని చూసి గుండె తరుక్కుపోయిందన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా పాడిపంటలతో కళకళలాడిందని అన్నారు.
గత ఏడాది ఆలేరు నియోజకవర్గంలో 1,000 చెరువులు నింపామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారని, ప్రస్తుతం వర్షాలు లేక చెరువులు, బోర్లు, బావులు ఎండిపోతున్నా చెరువులు నింపాలనే సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు. తక్షణమే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే తపాస్పల్లి జలాలతో బొందుగుల చెరువును నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ, విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మాజీ ఎంపీపీ బాలమణి యాదగిరిగౌడ్, జల సాధన సమితి అధ్యక్షుడు ఎర్ర గోకుల జశ్వంత్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మర్ల నాగరాజు, ఉపసర్పంచ్ యండి అబీద్, నాయకులు గుండెగోని శీను, రాంగోపాల్రెడ్డి, వరిమడ్ల బాలకృష్ణ, స్వామి, నిమ్మల సుదర్శన్, బోయిని రాజు, మాపు భాస్కర్ పాల్గొన్నారు.