యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో 200 మంది సివిల్, ఏఆర్, ట్రాఫిక్, ఎస్వోటీ, నేర, మహిళా పోలీసు అధికారులతో మూకుమ్మడి సోదాలు చేశారు. పట్టణంలో ప్రశాంత్నగర్, గణేశ్ నగర్ ప్రాంతాలలోని సుమారు 400 ఇండ్లల్లో సుమారు 2 గంటల పాటు తనిఖీలు చేశారు. అనుమానం వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఇంటింటికీ కలియ తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు.
సరైన పత్రాలు చూపకుండా, సమాధానం దాట వేసిన వ్యక్తులతో పాటు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు తదితర వివరాలను సేకరించారు. రౌడీ షీటర్ల ప్రవర్తనపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వారి జీవనం, చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు, వృద్దులు ఉన్నారన్న ఆంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇతర ఇబ్బందులపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డీసీపీ నారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెలడించారు. ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి, పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం కలిగించేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా గత రెండేండ్లుగా సెర్చ్ను నిలిపివేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారంలో రెండు రోజులు ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు వివరించారు. యాదాద్రి పవిత్రతను కాపాడేందుకు, ఇక్కడి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేస్తామని తెలిపారు.
సరైన పత్రాలు లేని 26 బైకులు, రూ. 5,000 విలువ గల అక్రమ మద్యం బాటిళ్లతో పాటు సరైన పత్రాలు లేని ఆటోలు, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. యాదాద్రి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ తనిఖీల్లో యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహ్మారెడ్డి, పట్టణ సీఐ జానకీరెడ్డి, రూరల్ సీఐ నర్సయ్య, ఎస్సై యాదయ్య, మోటకొండూర్ ఎస్సై నాగరాజు, ఎస్సైలు ఇద్రీస్ అలీ, మధు తదితరులు పాల్గొన్నారు.