మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 3: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపారు. రెండు అంతస్తులుగా చెక్కిన ఈ శిల్పం, ఆత్మార్పణ వీరగల్లు అని తెలిపారు.
మొదటి అంతస్తులో వీరుడి నడినెత్తిన కొప్పుకట్టి, ఆ సిగముడికి పొడుగాటి రుమాలు పట్టికట్టి ఉందన్నారు. వీరుడి తొడలమీదికి పొట్టిలాగు, నడుమున నడికట్టు, ముంజేతులకు దండరెట్టలకు కడియాలతో, చెవులకు పెద్ద కుండలాలు ధరించి ఉందన్నారు. కుడి చేతిలో ఎత్తిపట్టుకున్న కత్తి భుజానికి ఆనించి ఉన్నట్లు తెలిపారు.
ఎడమ చేతిలో శివలింగం పట్టుకొని కనిపిస్తున్నట్లు తెలిపారు. కుడి చేత్తో పట్టుకున్న కత్తితో ఆయన తల నరుక్కొని ఆత్మార్పణం చేసుకున్నట్లు కనిపిస్తుందన్నారు. వీరుడిపైన ఉన్న రెండో అంతస్తులో ఇద్దరు అమరంగణాల మధ్య ఆత్మార్పణం చేసుకున్న ఆ వీరుడు కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ శిల్పం శైలిని బట్టి ఇది ఆత్మార్పణ వీరగల్లు అని, ఇలాంటి శిల్పాలు శైవుల వీరభక్తికి నిదర్శనాలు అని కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.