భువనగిరి గులాబీ వనమైంది. బీఆర్ఎస్కు, కేసీఆర్కు అండగా ఉంటామంటూ దండు కదిలింది. నెత్తిన టోపీ, చేతిలో జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు కదనోత్సాహంతో కదిలివచ్చాయి. జనం తండోపతండాలుగా తరలిరావడం ప్రతిపక్షాల్లో గుబులు పుట్టించింది. బీఆర్ఎస్కు కంచుకోటగా పేరున్న భువనగిరిలో కేసీఆర్ సభ గులాబీ దండుకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. గులాబీ బాస్ ప్రసంగించినంత సేపు.. ఆసాంతం ఈలలు, చప్పట్ల హోరు సభలో మార్మోగింది.
కేసీఆర్ బస్సు యాత్రలో గురువారం భాగంగా రెండో రోజు కొనసాగింది. సాయంత్రం సూర్యాపేట నుంచి ప్రారంభమై తిరుమలగిరి మీదుగా బయల్దేరారు. అటు నుంచి జనగాం వెళ్లి అనంతరం ఆలేరు బైపాస్ మీదుగా భువనగిరికి చేరుకున్నారు. బస్సు యాత్రం సందర్భంగా దారిపొడవునా కేసీఆర్కు జనం నీరాజనం పలికారు. ఆయన్ని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం ఎగబడ్డారు. కేసీఆర్ బస్సుతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రాత్రి రాయగిరి రోడ్డు నుంచి భువనగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వినాయక చౌరస్తా వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వెంట కిలోమీటరు మేర బస్సు యాత్రకు మహిళలు పూల వర్షం కురిపించారు. బస్సులో నుంచే కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
కేసీఆర్ రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. జనం ప్రభంజనంలా వెల్లువెత్తారు. వినాయక చౌరస్తా జన సంద్రమైంది. నియోజకవర్గంలోని దారులన్నీ భువనగిరిలోని కేసీఆర్ సభ వైపే నడిచాయి. వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, బైక్లతో కదిలివచ్చారు. అంచనాలకు మించి ప్రజలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. సభ ఆసాంతం జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ సీఎం నినాదాలతో దద్దరిల్లిపోయింది. కేసీఆర్ సభ నేపథ్యంలో భువనగిరి గులాబీమయంగా మారింది. పట్టణమంతా కటౌ ట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో నిండింది. బైక్ ర్యాలీలతో యువత ముందుకు కదిలారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కండ్లను కట్టేలా మహిళలు బతుకమ్మలు, కోలాటాలు తరలివచ్చారు. ఒగ్గుడోలు, కొమ్ముడోలు కళాకారులు సంప్రదాయ కళా రూపాలతో మెప్పించారు. గిరిజనులు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా సాయంత్రం నాలుగు గంటలకే జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభలో అన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
భువనగిరికి కేసీఆర్ వస్తున్నారని తెలియడంతో అన్ని వర్గాల ప్రజల ఉరకలెత్తే ఉత్సాహంతో తరలివచ్చారు. చిన్నా, పెద్దా, యువత, అంతా కదం తొక్కారు. మహిళలు చిన్న పిల్లలను ఎత్తుకుని రావడం కనిపించింది. చేతిలో కర్రలు, మెడలో కండువా కప్పుకొని ముసలోళ్లు అడుగులో అడుగేసుకుంటూ వచ్చారు. ఇక యువత, విద్యార్థులు సైతం కేసీఆర్ ప్రసంగాన్ని, ఫొటోలను ఆసక్తిగా సెల్ఫోన్లలో చిత్రీకరించారు. భూదాన్పోచంపల్లికి చెందిన వృద్ధురాలు కర్నాటి లక్ష్మమ్మతో మాట్లాడగా.. ‘కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అభిమానిని. రేవంత్రెడ్డి బ్రోకర్. ఆ దగుల్బాజీ వచ్చి అంతా ఆగం చేస్తున్నడు. నేతన్నలకు నెలనెలా పైసలేసుడు బంద్ చేసిండు. పథకాలన్నీ ఆపిండు’ అని బదులిచ్చింది. భువనగిరికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి బాలాచారిని పలుకరించగా.. ‘పదేండ్ల క్రితం వరకు ఎన్నో ఏండ్లు గోస పడ్డాం.. బాధలు అనుభవించాం. అవన్నీ తెలుసు. మూడు నెలల కిందటి వరకు కూడా ఎట్లుందో తెలుసు. కానీ మళ్లీ మూడు నెలల నుంచి పరిస్థితి మారింది. నీళ్లు, కరెంట్ కష్టాలు వచ్చినయ్. ఇందిరమ్మ రాజ్యమంటే బిందెలు పట్టుకొని రోడ్లమీదకు రావడమా?’ అని నిలదీయడం కనిపించింది. పిల్లాడిని భుజానెత్తుకొని.. భార్య, మరో పిల్లాడితో కలిసొచ్చిన ఎండీ షఫీర్ను కదలించగా.. ‘కేసీఆర్ అంటే మస్తు అభిమానం. ఆయన కోసం కుటుంబం సహా వచ్చినం. మళ్లీ ఆయన పాలనే రావాలి’ అని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపూ వినాయక చౌరస్తా దద్దరిల్లిపోయింది. దిక్కులు పిక్కటిల్లేలా జన హోరు కొనసాగింది. కేసీఆర్ మాట్లాడే సమయంలో బీఆర్ఎస్ శ్రేణుల ఈలలు, చప్పట్లు, కేరింతలతో మార్మోగింది. గులాబీ బాస్ ప్రసంగం ప్రారంభిస్తూ.. ‘గౌరవనీయులైన’ అనడంతోనే పెద్దఎత్తున ఈలలు, చప్పట్లు, కేరింతలతో వినాయక చౌరస్తా మార్మోగింది. దీంతో ‘కొద్దిసేపు.. ప్లీజ్.. తమ్ముడూ ప్లీజ్” అని కేసీఆర్ అనడంతో కాస్త శాంతించారు. ప్రసంగం సమయంలో కేసీఆర్ ప్రశ్నలు సంధిస్తూ ప్రజలను మమేకం చేశారు. ‘బీజేపీతో రాష్ర్టానికి ఏమన్నా జరిగిందా..?’ అని అనగానే జరగలేదంటూ పెద్దఎత్తుగా కేరింతలు కొట్టారు. బేటీ పడావో.. బేటీ బచావో అంటున్నది.. బేటీ పడాయించిందా..? బేటీ బచాయించిందా..? అనడంతో ఫుల్ జోష్ నెలకొంది. రైతుబంధు అందరికి వచ్చిందా..? అని ప్రశ్నించగానే.. రాలేదని, అధికారం మారగానే కట్క ఒత్తినట్లు కరెంట్ పోతదా..? తొమ్మిదేండ్లు కరెంట్ మంచిగానే వచ్చిందిగ.. ఇప్పుడెందుకు పోతది..? వీళ్లను ఏమనాలి.. దద్దమ్మలు కాదా..? అని అనడతో ఒక్కసారి చౌరస్తా హోరెత్తింది.
రోడ్డు షో సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాంగ్రెస్ మోసాలు, గతంలో బీఆర్ఎస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడుతూ అలరింపజేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కళాకారులతో కలిసి పాట పాడారు. భద్రాచలం సినిమాలోని ‘ఒకటే జననం.. ఒకటే మరణం’ పాటను అందుకుని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే విధంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సైతం కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం నింపారు.
రెండు జాతీయ పార్టీలు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ఒక పార్టీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటుంటే.. మరో పార్టీ దేవుడిపై ఒట్లు వేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని, ఏనాడైనా ఓట్ల కోసం వాడుకున్నామా అని నిలదీశారు. ఇది వాళ్లకు, మనకు మధ్య ఉన్న తేడా అని స్పష్టం చేశా రు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఇందుకు భువనగిరి రాజకీయాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి భువనగిరి మున్సిపల్ చైర్మన్ను దించాయని, చైర్మన్ పదవి కాంగ్రెస్, వైస్ చైర్మన్ పదవిని బీజేపీ పంచుకున్నాయని, ఎవరు కుమ్మక్కో ఇప్పుడైనా తెలుస్తుందా అని ప్రశ్నించారు.
కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అని చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారని తెలిపారు. భువనగిరిలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెచ్చిన తెలంగాణను సుభిక్షంగా ఉంచాలని, ప్రజలకు ఏ ఇబ్బంది కూడా లేకుండా పదేండ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు నాలుగు నెలల్లోనే మళ్లీ పదేండ్ల వెనక్కి తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు నీళ్లు, కరెంట్ లేక చాలా కష్టాలు పడుతున్నారని, పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. కండ్ల ముందు ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక కేసీఆర్ జనం మధ్యకు వచ్చారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతోనే ఇది సాధ్యమైతుందని, క్యామ మల్లేశ్ను ఆదరించాలని కోరారు.