అవసరమని అంచనావికారాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. రైతులకు లాభాన్నందించాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది కొన్ని రకాల పంటల సాగును పెంచుతూ, మరికొన్ని పంటల సాగును తగ్గించారు. అయితే గతేడాది ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 30 వేల ఎకరాలకుపైగా పెంచుతూ సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 3 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు పెరుగుతుందని అధికారులు అంచనా వేశా రు. గతేడాది 2.61 లక్షల ఎకరాల్లో పత్తి పంట జిల్లాలో సాగు కాగా.. ఈ ఏడాది 2.63 లక్షలకుపైగా ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా కంది పంట సాగును పెంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకాగా, ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు పెం చాలని భావిస్తున్నది. అందుకోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. మరోవైపు మొక్కజొన్న సాగు కూడా పెరుగుతుందని, వరి సాగు గతేడాదితో పోలిస్తే సుమారు 23 వేల ఎకరాల మేర తగ్గనున్నదని అధికారులు అంచనాలను రూపొందించారు. మొత్తంగా జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5.97 లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగు అవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. అందులో పత్తి-2,63, 500 ఎకరాలు, కంది-1,50, ఎకరాలు, మొక్కజొన్న-50,450ఎకరాలు, వరి- 1,10,000 ఎకరాలు, మినుములు-5000 ఎకరాలు, సోయాబీన్-2500 ఎకరాలు, జొన్నలు-2500ఎకరాలు, పెసర్లు-13,000 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే గతేడాది ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 5.81 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా.. అందులో వరి-1,34,857 ఎకరాలు, మొక్కజొన్న-55,751, జొన్న-2,033, కందులు-1,31,284, పెసర్లు-13,453, మినుములు-5175, పత్తి-2,30,285 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం…
వ్యవసాయాధికారులు రూపొందించిన సాగు ప్రణాళికకు సరిపడా ఎరువులు, విత్తనాల ను మే మొదటి వారంలోగా అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో పీఏసీఎస్ డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేయాలని నిర్ణయించారు. వానకాలంలో యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 75,437 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందులో యూరియా-32,329 మెట్రిక్ టన్నులు, డీఏపీ-17,719 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు-19,877 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ-3,658 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ-1,854 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారు లు భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా 5,42,400 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు, వరికి సంబంధించి 27,500 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న- 4,036, పెసర్లు-1040, కందులు-4500 , మినుములు-400, సోయాబీన్-750 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు
రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుం టున్నాం. వర్షాలు ప్రారంభమైన తర్వాత రైతులంతా ఒకేసారి ఎరువులు కొనేందుకు వచ్చి ఇబ్బందులు పడకుండా ముందే కొని నిల్వ చేసుకోవాలి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాలపై రైతులు కూడా అవగాహన పెంచుకోవాలి. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే ఎరువులు, విత్తనాలను కొనాలి.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి