హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నదా? రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటున్న రేవంత్రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచి వేసేందుకు కంకణం కట్టుకున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
ఇటీవల పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాల రద్దు అంశాన్ని బలపరుస్తున్నాయి. తాజాగా ఒక న్యూస్ చానల్కు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిల్లాలను రద్దు చేస్తున్నట్టు సూత్రప్రాయంగా తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 19 జిల్లాలు రద్దు కానున్నట్టు తెలిసింది. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒకటి లేదా రెం డు చొప్పున జిల్లాలు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జి ల్లాల రద్దుతో ప్రజలు మళ్లీ మునుపటి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడీషియల్ కమిషన్
జిల్లాల రద్దు, పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో జ్యుడీషియల్ కమిషన్ పేరుతో డ్రామాకు తెరతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాల రద్దుతో రాష్ర్టాభివృద్ధికి విఘాతం
కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలకు మునుపటి కష్టాలు మళ్లీ వస్తాయనే ఆందోళన ప్రజల్లో నెలకొన్నది. దీంతోపాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆయా జిల్లాల్లో పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. రియల్ఎస్టేట్ రంగం కూడా విస్తరించింది.
అప్పుడు కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ప్రతి జిల్లాలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు ఒకే వద్ద ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించారు. వాటిల్లో ఉద్యోగులు, ప్రజలకు సకల సౌకర్యాలను కల్పించారు. ఇప్పుడు జిల్లాల రద్దు నిర్ణయంతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను ఏం చేస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
తుగ్లక్ పాలనలో జిల్లాల కుదింపు: దిలీప్ కొణతం
తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా తయారైందని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం మంగళవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో అలజడి, అల్లకల్లోలం సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.
రేవంత్ త్వరలో రద్దు చేస్తారంటూ ప్రచారమవుతున్న జిల్లాల జాబితా
1. ఆసిఫాబాద్, 2. జనగామ, 3. మంచిర్యాల , 4. హన్మకొండ , 5. నిర్మల్, 6. ములుగు, 7. జగిత్యాల,
8. సంగారెడ్డి , 9. సిద్దిపేట , 10. జోగులాంబ గద్వాల, 11. కొత్తగూడెం , 12. కామారెడ్డి , 13. సూర్యాపేట,
14. రంగారెడ్డి , 15. సిరిసిల్ల, 16. భూపాలపల్లి , 17. వికారాబాద్, 18. నారాయణపేట, 19. వనపర్తి