వికారాబాద్, ఏప్రిల్ 30 : ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా మాదిగలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్లో బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరుగకుండా మాదిగలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇప్పటికీ మాదిగల సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనీ ఎమ్మార్పీఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గురి చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు, రైతులు, కార్మికులకు చేసిందేమీలేదన్నారు. అనంతరం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను వివరించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆనంద్, బీజేపీ నాయకుడు నవీన్కుమార్ పాల్గొన్నారు.