కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 28: ముక్కిడిగుండం, మొలచింతపల్లి గ్రామాల రైతుల కల సాకారం కానున్నది. తమకు సాగునీటియోగం లేకున్నా మా పిల్లలు పెద్దవారయ్యేవరకన్నా జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు సాగునీరందితే చాలని నల్లమల రైతులు ఎన్నో కలలుగన్నారు. వారికల సాకారానికి సర్వేరూపంలో తొలి అడుగుపడింది. ఎంజీకేఎల్ఐ నీటిని ఎలాగైనా జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు చేరవేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కృషి చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, పనులు కూడా ప్రారంభం కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. మంగళవారం ఎంజీకేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప వరకు ఇరిగేషన్ అధికారులు తాత్కాలికంగా అవుట్లైన్ సర్వే నిర్వహించారు. ఇదిలా ఉండగా రూ.12కోట్లతో నార్లాపూర్ మొండికుంట చెరువునుంచి మొలచింతలపల్లి పెద్దచెరువు వరకు నీళ్లు తీసుకెళ్లే పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయితే మొలచింతపల్లి పెద్దచెరువు ఎంజీకేఎల్ఐ నీటితో నిండుతుందన్నారు.
అక్కడి నుంచి లిఫ్ట్ లేదా కెనాల్ ద్వారా జీల్దార్తిప్పకు వరదనీటిని చేరవేసే ప్రణాళికలు చేపట్టనున్నారు. మంగళవారం రాత్రి కొల్లాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్ది సర్వే పనులపై చర్చ నిర్వహించారు. శాశ్వత నిర్మాణాలతోపాటు జిల్దార్తిప్ప ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో నీటిని అందించేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులకు సూచించారు. జీల్దార్తిప్ప ప్రాజెక్టుకు ఒకసారి నిండితే దాదాపు 3వేల ఎకరాల బీడుభూములు సస్యశ్యామలమై రెండు పంటలు పండుతాయి. నిత్యం ప్రాజెక్టులో నీళ్లుంటే నల్లమల గ్రామాలైన మొలచింతపల్లి, ముక్కిడిగుండి వాటి పరిధిలోని తండాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. ఎమ్మెల్యే బీరం గతంలో ముక్కిడిగుండం మొలచింతపల్లి గ్రామాలకు దాదాపు 3కిలోమీటర్లదూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న జీల్దార్ తిప్ప ప్రాజెక్టును పలుసార్లు పరిశీలించారు. ఎలాగైనా సాగునీటిని అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆశించన ఫలితాన్ని రాబట్టుకున్నారు. ముందుగా సర్వేతో తొలి అడుగుపడింది. మరికొన్ని రోజుల్లోనే జీల్దార్తిప్పప్రాజెక్టుకు సాగునీరందనున్నది.